అమరావతి : ఏపీలో ఉన్న 56 కార్పొరేషన్లలో ఇప్పటి వరకు ఖర్చు చేసిన వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంభిస్తు్న్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కర్నూలులో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ. 26వేల కోట్లు మళ్లించడం, 11,500 ఎకరాల ఎస్సీల అసైన్డ్ భూములు లాక్కోవడం, 10 మందికి పదవులిచ్చి వేల మందిని చంపడం సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు.
ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా మూడేళ్లలో ఖర్చు చేసిందెంత అని నిలదీశారు. మన్యంలో చంద్రబాబు కాఫీతోటలు పెంచితే జగన్ గంజాయి తోటలు పెంచారని ఆరోపించారు. మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483 కోట్లు మళ్లింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మూడేండ్ల వైసీపీ పాలనలో పన్నులు పెంచుతూ పేదవర్గాలను బాదుడే బాదుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్నారని మండిపడ్డారు.