తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామివారిని జనవరి నెలలో 21 లక్షల 9వేల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో (TTD EO) ధర్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం అన్నమయ్య భవన్ నుంచి నిర్వహించిన డయల్ యువర్ ఈవో(Dial Your EO) ద్వారా భక్తులతో మాట్లాడారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 116.46 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. 1.03 కోట్లు లడ్డూలను విక్రయించామని, 46.46 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం అందించామని పేర్కొన్నారు. 7.05 లక్షలు మంది కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు.
మూడు కళాశాలలకు అటానమస్ హోదా..
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలకు అటానమస్ హోదా లభించిందని ఆయన వివరించారు. దీని వల్ల కళాశాలల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశంతోపాటు విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్లో మార్పులు చేసుకోవడం వీలవుతుందని అన్నారు. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయని వెల్లడించారు .