అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఓ యువకుడు పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. జిల్లాలోని వెలుగోడు మండలం బోయరేవుకు చెందిన శివకుమార్కు నిన్న రాత్రి వివాహం జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రివరకు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇంతలోనే మరుసటి రోజు ఉదయమే గ్రామశివారులో గాయాలతో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.
అతడిని నంద్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏదేని వాహనం ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శివకుమార్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.