ఎన్టీఆర్ జిల్లా : విజయవాడను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు అందరమూ నడుం బిగిద్దామని విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్కు బదులుగా జ్యూట్, పేపర్ బ్యాగులను వాడటం అలవాటు చేసుకోవాలని కోరారు. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ను పురస్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో నిర్వహించిన ర్యాలీలో వీఎంసీ కమిషనర్ పుండ్కర్ పాల్గొని ప్రసంగించారు. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు.
విజయవాడను సింగిల్ యూజ్ ప్లాస్టిక్, చెత్త రహితంగా మార్చాల్సిన ఆవశ్యకతను విజయవాడ మున్సిపల్ కమిషనర్ పుండ్కర్ నొక్కి చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వీఎంసీ పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. స్వచ్ అమృత్ మహోత్సవ్లో భాగంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పరిశుభ్రత, ఆరోగ్యం, స్వచ్ఛ మిషన్పై అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్లో యువత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మిషన్లో విజయవాడ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని, ఆ స్థానాన్ని నిలుపుకోవడంతోపాటు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలను జాగురూకం చేయాలన్నారు. మార్కెట్కు వెళ్లేప్పుడు తప్పనిసరిగా వస్త్రంతో చేసిన చేయి సంచి తీసుకుని వెళ్లే అలవాటు చేసుకోవడం ద్వారా ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయవచ్చునని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు అధికారులు బహుమతులు అందజేశారు. వీఎంసీ ఆధ్వర్యంలో చిన్నారులకు వాల్ పెయింటింగ్, వ్యాసరచన, క్విజ్ తదితర పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు.