Vivekananda Murder | న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి పేర్కొన్నారు. నాన్న హత్య కేసులో న్యాయం కోసం ఐదేండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు. నాన్నను గొడ్డలితో నరికారని జగన్ననకు ఎలా తెలుసు అని ఆమె ప్రశ్నించారు. మళ్లీ జగన్ననకు ఓటేస్తే.. ప్రజలకు కష్టాలు తప్పవు అని సునీతా రెడ్డి స్పష్టం చేశారు. షర్మిల మాత్రం తనకు మొదట్నుంచి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు.
సాధారణంగా హత్య కేసులను నాలుగైదు రోజుల్లో చేధిస్తారు. నిందితులు ఎవరనేది నిర్ధారిస్తారు. కానీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదేండ్లు అయినా ఇంకా ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు. హత్య తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట అవినాష్ తన వద్దకు వచ్చారు. రాత్రి 11:30 గంటలకు వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని తెలిపారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు. మనం మాత్రం రియలైజ్ కాలేం. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది..? సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు..? నాన్నను గొడ్డలితో చంపారనే విషయం జగన్ననకు ఎలా తెలుసు..? అది బయటకు రావాలని సునీత డిమాండ్ చేశారు.
మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందన్నారు. వాళ్లిదర్నీ జగన్ రక్షిస్తున్నారని ఆమె ఆరోపించారు. అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుంది. వంచన, మోసానికి పాల్పడ్డారు. తమ అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దు.. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అని చెప్పారు. ఇచ్చిన మాట మీద నిలబడుతా.. విశ్వసనీయత అంటూ జగన్ పదేపదే చెప్తున్నారు. కానీ ఈ చెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలన్నారు. సొంతవాళ్లను సులువుగా అనుమానించలేం.. అందుకే జగన్ను కలిసినప్పుడు తనకు ఆయనపై అనుమానం రాలేదు. ఒక్కో వాస్తవం బయటకు వస్తుంటే నమ్మాల్సి వచ్చింది. ఈ హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా రాని పేర్లు చాలా ఉన్నాయి. జగన్ పాత్రపైనా విచారణ చేపట్టాలి.. ఒక వేళ నిర్దోషిగా తేలితే వదిలేయాలి. తప్పు చేసిన వారు మాత్రం తప్పించుకోకూడదని సునీత అన్నారు.