అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యలతో పాటు పీతల పెంపకానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ప్రెస్తుతం పీతల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణమేంటో తెలియకుండానే వందలాది పీతలు చనిపోయి నీటిపై తేలియాడుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వీటి మరణానికి మడ్ క్రాబ్ రియోవైరస్ (ఎంసిఆర్వీ) కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ , సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ స్టడీ ఇన్ మెరైన్ బయాలజీ (అన్నామలై యూనివర్సిటీ, తమిళనాడు) ఆధ్వర్యంలో పీతల మరణాలపై పరిశోధనలు చేశారు. కృష్ణా జిల్లాలోని నాగాయలంకతోపాటు బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన నమూనాల్లో మడ్ క్రాబ్ రియో వైరస్ ఉనికిని పరిశోధక బృందాలు గుర్తించాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నాగాయలంక ప్రాంతాల్లో 2019 నుంచే అడవి పీతలు చనిపోతున్నట్టు స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వెల్లడించింది.
2019 నాటికి కృష్ణా జిల్లాలో 4,500 ఎకరాలతో సహా ఆంధ్రప్రదేశ్లో అడవి పీతల సాగు మొత్తం 25వేల ఎకరాలుగా ఉండేది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లోనూ అడవి పీతల సాగు ఉంది. అయితే 2019 నుంచి ఏపీలో వీటి మరణాలతో 60శాతం సాగు తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పీతలను నేరుగా ఆగ్నేయాసియా ప్రాంతానికి ఎగుమతి చేస్తారని, వీటికి మంచి డిమాండ్ కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్లీపింగ్ డిసీజ్ అని పిలిచే మడ్ క్రాబ్ రియో వైరస్..వ్యవసాయ పద్ధతిలో పెంచుతున్న అడవి పీతలపై ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. క్రాబ్ ఫ్యాట్నింగ్, క్రాబ్ పాలికల్చర్లో రొయ్యలు, అడవి పీతలను ఒకే చెరువులో పెంచు తున్నారు.