అమరావతి : ఏపీలో పలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డిగ్యాంగ్ ముఠాలోని ముగ్గురు సభ్యులతో పాటు వారికి సహకరిస్తున్న మరో సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి అరెస్టు వివరాలను శుక్రవారం విజయవాడ పోలీసు కమిషనర్ కేఆర్ టాటా వెల్లడించారు. గుజరాత్లోని దాహర్ జిల్లా గుల్బర్గకు చెందిన రెండు అంతరాష్ట్ర చెడ్డిగ్యాంగ్లు ఏపీలో దొంగతనాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. వీరిలో ఒక ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. వీరు ఏపీలో 18కేసుల్లో నిందితులని వివరించారు.
మరో 7గురు చెడ్డి గ్యాంగ్ సభ్యులు గుజరాత్, రాజస్థాన్, మద్యప్రదేశ్లో ఉన్నట్లు సమాచారం ఉందని వారి పట్టుకోవడానికి తమ పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయని తెలిపారు. వీరిని త్వరలో పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. సీసీ , ఫింగర్ ఫుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించామని సీపీ తెలిపారు. నిర్మానుష్య ప్రదేశాల్లో ఉండే ఇండ్లను , ఎవరూ లేని ఇండ్ల వద్ద పగలు రెక్కీ నిర్వహించి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు.