YSR Congress MLA Malladi | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలు పాటిస్తానని విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఇన్ చార్జీగా వెల్లంపల్లి శ్రీనివాస్ను వైసీపీ అధిష్టానం ఇంతకుముందే ప్రకటించింది. నాటి నుంచి అలకపాన్పు ఎక్కిన సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 10 రోజులుగా మౌనంగా ఉన్నారు. తాజాగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లు మల్లాది విష్ణు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తామని మల్లాది విష్ణుకు వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చిందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లంపల్లికి సహకరించాలని తన వర్గానికి మల్లాది విష్ణు సంకేతాలు ఇచ్చారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పది రోజులుగా మల్లాది విష్ణు మౌనంగా ఉన్నా.. ఆయన వర్గం నాయకులు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లంపల్లికి సహకరించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వైసీపీ అధిష్టానం మల్లాది విష్ణును బుజ్జగించేందుకు ప్రయత్నించింది. ఇన్ చార్జీగా నియమితులైన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మల్లాది విష్ణుతో సమావేశం అయ్యారు.