తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్ల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అలాగే సాలకట్ల వసంతోత్సవానికి (Salakatal Vasanthotsavam) సంబంధించిన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30, 31వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి (Sri Rama navami) మరియు శ్రీరామపట్టాభిషేకం ఆస్థానాలు నిర్వహించనుంది. మార్చి 30న హనుమంత వాహన సేవ ఉంటుంది. ఈ సందర్భంగా ఉదయం 9 నంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుంచి 08 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 31న రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.