హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ను గురువారం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విడుదల చేసింది. ప్రతినెలా 18 నుంచి 20 వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీడిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22 వరకు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలి. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు వర్చువల్ సేవా టికెట్లను ప్రతినెలా 21న విడుదల చేయనున్నారు. శ్రీవాణి, అంగ ప్రదక్షిణం, వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు ప్రతినెలా 23న, రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, గదుల కోటా కోసం తిరుపతిలో 25న, తిరుమలలో 26న ప్రతినెలా టికెట్లను విడుదల చేయనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లు, షెడ్లు నిండిపోయి మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. బుధవారం స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ.3.77 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.