తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టీటీడీ జెఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు,భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై ఇంజినీరింగ్,ఆలయ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయ గోపురానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆర్కియాలజి విభాగం అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఇందుకోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేవిధంగా,పచ్చదనంపెంపు,తాగునీరు,ప్రసాద వితరణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశామన్నారు.
వివాహాలు చేసుకునేందుకు మండపం నిర్మించాలని అర్చకులు కోరారని, అందుకోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కల్యాణవేదిక వద్ద పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని,చక్కటి దారి కల్పించాలని ఆదేశించామన్నారు. పిఏసిలో గదుల అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించామన్నారు. అదేవిధంగా,ఆర్చిల నిర్మాణం,కల్యాణవేదిక వద్ద వివాహాలు చేసుకునే సదుపాయం,రామకోటి స్థూపం తదితర అంశాలను ఈవో దృష్టికి తీసుకెళతామన్నారు.