తిరుపతి : భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన శిల్పకళను విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ కృషి చేస్తున్నదని జేఈఓ శ్రీమతి సదా భార్గవి చెప్పారు. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థలో సంప్రదాయ శిల్పకళ–అనుబంధ అంశాలపై మూడు రోజుల పాటు నిర్వహించే వర్క్షాప్ను జేఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ సదాభార్గవి మాట్లాడుతూ.. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదన్నారు. టీటీడీ ప్రారంభించిన వర్క్షాప్ ఇందుకు నాంది మాత్రమేనని, భవిష్యత్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు.
దేవాలయ ఔన్నత్యాన్ని కళ్లకు కట్టినట్టు వివరించే గొప్పకళ శిల్పకళ అని సదాభార్గవి కొనియాడారు. టీటీడీ శిల్పకళాశాల ఎందరో ప్రముఖ స్థపతులను ప్రపంచానికి అందించిందని, ఇక్కడ చదివిన ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఏపీలోని శిల్ప కళాశాలల నుంచి ప్రముఖ స్థపతులను పిలిపించి వర్క్షాప్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. శిల్పకళలో నైపుణ్యం పెంపొందించుకుని గొప్ప స్థపతులుగా తయారుకావాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు.
కళాశాలలో చేరే సమయంలో ప్రతి విద్యార్థి పేరు మీద రూ.లక్ష డిపాజిట్ చేసి.. కోర్సు పూర్తయ్యాక వారికి వడ్డీతోపాటు అందజేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం కోర్సులుగా కళంకారి, వర్లి ఆర్ట్, సౌరాష్ట్ర పెయింటింగ్ ఆర్ట్ కోర్సులను ప్రవేశపెడతామని సదాభార్గవి పేర్కొన్నారు. శిల్ప కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఆలోచిస్తున్నదని వెల్లడించారు. ఈ వర్క్షాప్లో ప్రముఖ స్థపతులు రాధాకృష్ణ, డాక్టర్ దక్షిణామూర్తి, హైదరాబాద్ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ శివనాగిరెడ్డి తదితరులు కూడా ప్రసంగించారు. డీఈఓ గోవిందరాజన్, ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వర్క్షాప్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కౌంటర్లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళాకృతుల ఎగ్జిబిషన్ను సదా భార్గవి ప్రారంభించారు. కుమారి పీ సాయిదేవిక నిరుపయోగ వస్తువులతో తయారుచేసిన వివిధ కళాకృతుల స్టాల్ను సందర్శకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. గృహాలంకరణకు ఉపయోగపడే అనేక కళాకృతులు ఈ స్టాల్లో పెట్టారు. అలాగే, శిల్పాలు, కళంకారీ పెయింటింగ్స్, చేనేత చీరలు, పంచగవ్య ఉత్పత్తులు కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచారు.