హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై లక్షిత (6) అనే చిన్నారి మృతిచెందింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేశ్-శశికళ దంపతులు తమ కూతురు లక్షితతో కలిసి శుక్రవారం రాత్రి 7:30 ప్రాంతంలో అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం వద్దకు చేరుకొనే సరికి అకస్మాత్తుగా ఓ చిరుత చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లింది.
తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు సాధ్యం కాలేదు. శనివారం ఉదయం లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయానికి సమీపంలో పోలీసులకు బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం లక్షిత మృతికి చిరుతే కారణమని తేలింది. కాగా, లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ప్రకటించారు. నడక మార్గంలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.