తిరుపతి : తిరుమల కొండకు మరింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ పనులు చేపట్టాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. ఫుట్పాత్లు, తాగునీటి కొళాయిలు, మరుగుదొడ్లు, ఇతర ఇంజినీరింగ్ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఉన్న సమావేశ మందిరంలో బుధవారం అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ, తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యానమందిరానికి సంబంధించిన దాత, ఆర్కిటెక్ట్తో చర్చించి పనులు వేగవంతం చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 24 గోశాలలను నోడల్ గోశాలలుగా గుర్తించామని, వీటిని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు స్థానిక దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తిరుపతిలోని గోశాలను మెరుగ్గా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని గోశాలలను అభివృద్ధి చేసేందుకు దాతల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. స్థానికాలయాల్లో గోపూజ నిర్వహణ మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గోశాలలో గోమాతకు ఇష్టమైన సంగీతం వినిపించేలా పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు నెలలోపు ఎస్వీ గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పూర్తి చేయాలని, దాణాను ఇక్కడే తయారు చేసి జనవరి నుంచి బయట కొనుగోలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ఏసీఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.