తిరుపతి : తిరుచానూరు(Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు(Vasantotsavam) గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 9.10 గంటలకు స్వర్ణ రథోత్సవాన్ని(Rathotsavam) కన్నులపండువగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని ఆలయ వేదపండితులు వెల్లడించారు.
వైభవంగా స్నపనతిరుమంజనం
వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుంచి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు ఒక్కొక్కరూ రూ.150 చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చని, వసంతోత్సవం కారణంగా గురువారం కల్యాణం, సహస్రదీపాలంకార)Sahasradipalankara) సేవలు రద్దయ్యాయని వివరించారు.