తిరుపతి : తిరుచానూరు(Tiruchanur) పద్మావతి అమ్మవారి( Padmavati Goddess) ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు (Vasantotsavam) శుక్రవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం స్నపనతిరుమంజనం నిర్వహించి ,పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.
రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.