అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా తాడిమర్రి పశువైద్యశాలలో ఇవాళ పశు వైద్య అధికారులు ఉడుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం నివేదిక వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు వివరాలను మీడియాకు ఇవ్వవద్దని ఆదేశాలున్నాయని పశువైద్యులు పేర్కొన్నారు. ఉడుత వల్లే ప్రమాదం జరిగిందని విద్యుత్ అధికారుల వివరణపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అనుమానాలు, ఆరోపణలు రావడంతో ఉడుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు.
నిన్న జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగి పడి ఐదుగురు సజీవదహనమైన ఘటనపై సంబంధిత అధికారులిచ్చిన వివరాలు అనుమానస్పదంగా మారాయి. విద్యుత్ తీగ నుంచి స్తంభంపైఉన్న ఇనుప క్లాంప్ మీదకు ఉడత దూకిన సమయంలో షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కావడంతో తీగలు తెగి అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడి ప్రమాదం జరిగిందని విద్యుత్ అధికారులు వివరణ ఇచ్చారు.