తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ( Fruit and Flower ) అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ను ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.
ధ్వజస్థంభం చెంత పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple) , బాల రాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స అవతారము భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన త్రేతా, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, వేదనారాయణ స్వామి, మహావిష్ణువు దశావతారాలు, తదితర పౌరాణిక ఘట్టాలు ఆకట్టుకున్నాయి.
టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, టీటీడీ గార్డెన్ సిబ్బంది 100 మంది రెండు రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల, పుష్ప ఆకృతులను తయారు చేశారు.