నెల్లూరు : అధికారులు సాధారణంగా బదిలీ కాగానే కార్యాలయంలోని ఫైళ్లు, ఫర్నీచర్ను కొత్తగా వచ్చే అధికారికిగానీ, మరో ఇంఛార్జీకిగానీ అప్పగించడం రివాజు. అయితే, ఈ డిప్యూటీ డీఈవో తీరు మాత్రం మరోలా ఉన్నది. బదిలీపై వెళ్తూ వెళ్తూ తన వెంట కార్యాలయం ఫర్నీచర్ను కూడా ఎంచక్కా ఆటోలో ఎక్కించి శుభ్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. కార్యాలయం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ ఫర్నీచర్ తరలించినట్లు తెలుస్తున్నది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కందుకూరులో చోటుచేసుకున్నది. స్థానికులు, డిప్యూటీ డీఈవో కార్యాలయం సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కందుకూరు ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి పదోన్నతులు పొందిన పలువురు ఉపాధ్యాయులు కొంత ఫర్నీచర్ను సమకూర్చారు. కార్యాలయానికి రంగులు కూడా వేయించి తీర్చిదిద్దారు. ఇలాఉండగా, కొత్త జిల్లాల ఏర్పాటులో కందుకూరు డివిజన్ కాస్తా నెల్లూరు జిల్లాలోకి వెళ్లడంతో… అప్పటివరకు డిప్యూటీ డీఈఓగా ఉన్న సామ సుబ్బారావు బదిలీ అయ్యారు. కాగా, బదిలీపై వెళ్తూ తన కార్యాలయంలోని ఫర్నీచర్ను ఆటోలో వేసుకుని వెళ్లిపోయారు. కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ ఫర్నీచర్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కార్యాలయ సిబ్బందికి చెప్పడంతో వారు రాత్రి వేళ వచ్చి కార్యాలయానికి మరో తాళం వేశారు.
డిప్యూటీ డీఈఓ తీరు పట్ల ఆ కార్యాలయం సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బదిలీపై వెళ్లిన సుబ్బారావు.. కార్యాలయం తాళం పగలగొట్టి తీసుకెళ్లారని ఇదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు మీడియాకు చెప్పారు. దొంగతనంగా ఫర్నీచర్ తీసుకెళ్లిన డిప్యూటీ డీఈఓ సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా సుబ్బారావుపై పలు అవినీతి ఆరోణలు ఉన్నాయని వారు చెబుతున్నారు.