ఏపీ మంత్రి ఉషాశ్రీ చరణ్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. వెయ్యి గొర్రెల మంద నుంచి ఒక్క గొర్రె కూడా తప్పిపోయినా… ఎంత బలవంతుడి వద్దనుంచైనా దానిని తిరిగి తీసుకొచ్చే సత్తా తనకుందన్న మంత్రి ఉషా శ్రీచరణ్ వ్యాఖ్యలకు జేసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాయకులు కాయాల్సింది గొర్రెలను కాదని, ప్రజలను చూసుకోవాలని హితవు పలికారు. ఎవరి వృత్తి వారు చూసుకోవాల్సిందేనని, తమది వ్యవసాయ కుటుంబమని, అయితే.. చాలా సంవత్సరాలుగా తాము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, తాము ప్రజలను చూసుకుంటున్నామని వివరించారు.
తన నియోజకవర్గానికి మంత్రి ఉషశ్రీ చరణ్ ఏదైనా మంచి పనులు చేయాలని, అలా చేస్తే ఆడబిడ్డ కట్నంగా మంచి చీరలు ఇచ్చి పంపుతామని అన్నారు. ఉషశ్రీ.. గతంలో ఏ పార్టీలో ఉన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని జేసీ చురకలంటించారు. ఆమెపై కర్నాటక లోకాయుక్తలో, సుప్రీం లో కేసులున్నాయని.. అవి కూడా చెప్పమంటారా? అంటూ ఫైర్ అయ్యారు. మీకంటే గట్టి విమర్శలే తాను చేయగలనని, అయితే.. ఓ మహిళ కాబట్టి, అన్నీ మాట్లాడటం లేదన్నారు.
పసిపాప చనిపోతే.. తాను మాట్లాడితే.. శవ రాజకీయాలు చేస్తున్నానని మంత్రి విమర్శలు చేస్తున్నారని, అసలు శవ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి చురకలంటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనే శవ రాజకీయాలు చేస్తున్నారని, తండ్రి వైఎస్ చనిపోయిన తర్వాత మూడేళ్ల పాటు శవ రాజకీయాలే చేశారని ఎదురు దాడికి దిగారు. కల్యాణదుర్గంలో పసిపాప మృతికి న్యాయ విచారణ జరిపించాలంటూ నేతలు నిరసన వ్యక్తం చేస్తే, రౌడీ షీట్ తెరుస్తారా? అంటూ జేసీ సూటిగా ప్రశ్నించారు. చనిపోయిన పసిపాప కుటుంబీకులకు పింఛన్ ఇప్పించాలని జేసీ మరోమారు డిమాండ్ చేశారు.
ఉషశ్రీ చరణ్ ఏమన్నారు?
జేసీ ప్రభాకర్ రెడ్డి కల్యాణదుర్గానికి వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ శిశు మహిళా సంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. బీసీ మహిళకు మంత్రి పదవి దక్కడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని చురకలంటించారు. వెయ్యి గొర్రెల మంద నుంచి ఒక్క గొర్రె తప్పిపోయినా.. దానిని తిరిగి తెచ్చే సత్తా తనకుందని, తనపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా, ప్రజలు నమ్మరని ఉషశ్రీ చరణ్ ధీమా వ్యక్తం చేశారు.