తెలుగుదేశం ప్రజల పార్టీ అని ఆ పార్టీ నేత లోకేశ్ అన్నారు. జగన్ది మాత్రం గాలి పార్టీ అని మండిపడ్డారు. ఆస్తిలో మహిళలకు టీడీపీ సమాన హక్కు కలిపిస్తే, సీఎం జగన్ మాత్రం తన సోదరిని పక్క రాష్ట్రానికి తరిమేశారని ఎద్దేవా చేశారు. పార్టీ 40 వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడని, తాను మాత్రం మూర్ఖుడినని అభివర్ణించుకున్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి, టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. రికార్డులు సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా.. ఒక్క టీడీపీతోనే సాధ్యమని ప్రకటించారు. సమయం లేదు మిత్రమా.. ఇక రెండేళ్లే అని సినిమా డైలాగ్ గుర్తొచ్చేలా వ్యాఖ్యలు చేశారు. రాముడు లాంటి చంద్రన్న వైపు ఉంటారో.. రాక్షసుడి లాంటి జగన్ వైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
చంద్రబాబు లాంటి విజినరీ కావాలా? లేదంటే.. జగన్ లాంటి ప్రిజనరీ కావాలా? అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు అందరూ నిత్యం ప్రజల్లోనే వుండాలని సూచించారు. తనపై జగన్ ప్రభుత్వం 11 కేసులు బుక్ చేసిందని, అయినా తాను భయపడటం లేదని తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అన్నది తమ నినాదమన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుదే అని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీకి ప్రతిపక్ష హోదా సాధించిన ఏకైక పార్టీ టీడీపీయేనని, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభావం చూపిన వ్యక్తులన్నారు. 1985లోనే మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది.. మళ్లీ 2024లో టీడీపీ జెండా ఎగరేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.