నెల్లూరు జిల్లా ఆత్మకూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో శంకర్ దాదా ఎంబీబీఎస్లదే రాజ్యం. వాళ్లే సెలైన్లు పెట్టేస్తారు. వాళ్లే వైద్యం చేసేస్తారు. వాళ్లే డాక్టర్లుగా చెలామణి అవుతుంటారు. తాజాగా… జరిగింది కూడా ఇదే. రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ అనే వ్యక్తి గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆత్మకూరు ప్రభుత్వాసుప్రతిలో చేర్పించారు. అయితే.. అతడికి సెక్యురిటీ గార్డులు, స్వీపర్లే చికిత్స చేశారు. వైద్యులు మాత్రం పత్తా లేరు.
రామకృష్ణ తలకు కట్టుకట్టి, సెలైన్లు పెట్టారు. అయితే.. డ్యూటీలో ఉన్న డాక్టర్ కేవలం ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చి, ఊరుకున్నాడు. ఈ పరిస్థితిని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రైవేట్ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. అయితే ఈ సమయంలో రామకృష్ణ తలకు కట్టిన కట్టు ఊడిపోయింది. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామకృష్ణ మృతిపై కుటుంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ వైద్యులు సరిగ్గా స్పందించకపోవడం వల్లే మరణించారని మండిపడ్డారు.