తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణ స్వామివారి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి గంట సేపు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వాహన సేవ కోలాహలంగా కొనసాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఔషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే శ్రీ ప్రసన్న సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం వైభవంగా జరుగనున్నది. ఉదయం 8.05 నుంచి 10 గంటల వరకు స్వామి వారు రథంపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణభట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, ఇతర ఆధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.