శ్రీశైలం : శ్రీశైల క్షేత్ర పరిధిని ఖచ్చితంగా గుర్తించేందుకు అటవీశాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి, ధర్మకర్తలతో కలిసి జిల్లా సర్వే అధికారి డైరెక్టర్ హరికృష్ణ, సర్వే ఇన్స్పెక్టర్ ఉమాపతి, నాగశ్రీ, అటవీశాఖ అధికారి ఎఫ్ఆర్వో నర్సింహులు సర్వే నిర్వహించారు.
క్షేత్ర అభివృద్ధికి, మాస్టర్ప్లాన్ అమలుకు పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు దేవాదాయశాఖ మరియు అటవీశాఖ భూముల సరిహద్దులు క్షుణ్నంగా నిర్ణయించి ప్రహరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. శ్రీశైల క్షేత్రంలో యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనులను బుధవారం ఆలయ ధర్మకర్తలమండలి పరిశీలించింది. ప్రధానంగా పూర్తి కావస్తున్న నిర్మాణ పనులలో తుదిమెరుగులు త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అదే విధంగా ఆలయ పుష్కరిణిలో పూడికతీత తొలగించి.. చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.