అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫేయిల్ అయిన విద్యార్థుల కోసం జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఫేయిల్ అయిన విద్యార్థుల కోసం ఈ నెల 13 నుంచి పరీక్షల వరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమతమ పిల్లలను శిక్షణా తరగతులకు పంపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షా ఫలితాలను ఇవాళ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం 6 లక్షల 15 వేల 980 మంది విద్యార్థులు హాజరు కాగా 4లక్షల 14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించారు. బాలురు 3 లక్షల16,820 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2 లక్షల 2081 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు రెండు లక్షల 99వేల 85 మంది పరీక్షలు రాయగా రెండు లక్షల 11వేల 460 మంది పాసయ్యారు. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02శాతం మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.
ఈ సారి కూడా ఉత్తీర్ణత శాతంలో బాలికలదే పైచేయిగా నిలిచిందని ఆయన వివరించారు. గతంలో కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కొవిడ్ ప్రధాన కారణమని అన్నారు. కొవిడ్ కారణంగా పాఠశాలలు తెరవకపోవడం ఒక కారణమైతే , ఇంటి వద్ద పర్యవేక్షణ లేకపోవడం మరో కారణమని బొత్స తెలిపారు.