తిరుమల: టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి కొందరు వ్యక్తులు అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాజకీయ, వ్యక్తిగత ప్రచారాలు ఆశించి హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ మీద అవాకులు, చవాకులు పేలడం రివాజుగా మారిందని విచారం వ్యక్తం చేసింది.
సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల, అటవీ గ్రామాలకు సైతం విస్తరించే లక్ష్యంతో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీనివల్ల తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో దళారీ వ్యవస్థ సైతం పూర్తిగా కనుమరుగైందని పేర్కొన్నారు. టికెట్ ధర పెట్టుకోగలిగే స్థోమత ఉన్న వారు ఎవరి సిఫారసు కోరకుండా, దళారీల బారిన పడి మోసపోకుండా శ్రీవాణి టికెట్ కొని నేరుగా స్వామివారి దర్శనం చేసుకోగలుగుతున్నారని టీటీడీ స్పష్టం చేసింది.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ప్రతి పైసా మారుమూల గ్రామాల్లో హిందూ ఆలయాలు, పురాతన ఆలయాల మరమ్మతులు, పునర్ నిర్మాణం కోసమే ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిధుల ద్వారా గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో 501 ఆలయాలు నిర్మించినట్లు వెల్లడించింది. రానున్న రెండేండ్లలో 1030 ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపింది. వాస్తవాలు ఇలా ఉంటే, కొందరు శ్రీవాణి ట్రస్ట్పైన అవాస్తవాలు ప్రచారం చేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని, ఇలాంటి వ్యక్తుల మీద, వారి అవాస్తవ ఆరోపణలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.