కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు, హాస్టల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన అధికారులు పీజీ విద్యార్థులను ఏకంగా యూనివర్సిటీ హాస్టల్ నుంచి బయటకు నెట్టేశారు. ఈ ఘటనపై రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. పీజీ విద్యార్థులపై అమర్యాదగా ప్రవర్తించిన హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే. మెస్చార్జీల బకాయిలు చెల్లించనందుకే వారిని వెళ్లిపోవాల్సిందిగా చెప్పినట్లు హాస్టల్ సిబ్బంది అంటున్నారు.
కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులకు నిలువ నీడ కరవైంది. విద్యార్థులు-హాస్టల్ సిబ్బంది మధ్య వాగ్వాదం చెలరేగి పీజీ విద్యార్థులను బయటకు గెంటేసే వరకు వెళ్లింది. బలవంతంగా విద్యార్థులను హాస్టల్ నుంచి బయటకు పంపించివేశారు. గత కొన్ని నెలలుగా విద్యార్థులు ఫీజు చెల్లించక పోవడంతో వారిని హాస్టల్ నుంచి పంపించి వేసినట్లు హాస్టల్ సిబ్బంది పేర్కొన్నారు. తమ పట్ల హాస్టల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, పీజీ విద్యార్థులమని కూడా చూడకుండా హాస్టల్ నుంచి బయటకు పంపించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాఉండగా, ప్రభుత్వం నుంచి అందాల్సిన ‘జగనన్న వసతి దీవెన పథకం’ డబ్బులు ఇంతవరకు విద్యార్థుల ఖాతాల్లో చేరలేదు. దాంతో విద్యార్థులు హాస్టల్ ఫీజులు చెల్లించలేకపోయారు. ప్రభుత్వానికి నివేదించాల్సిన వర్సిటీ అధికారులు ఇలా ప్రవర్తించడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో అధికారులు దిగొచ్చారు. బకాయిలు చెల్లించేందుకు విద్యార్థులకు రెండు రోజుల గడువిచ్చారు. దాంతో తాత్కాలికంగా విద్యార్థులను హాస్టల్లోకి అనుమతించారు.