శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో లవన్న పలువురు ప్రముఖులను కలిసి వేడుకలకు రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఈవో లవన్న సీఎం జగన్ను కలిసి, బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆ తర్వాత గవర్నర్ విశ్వభూషణ్ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి, శేషవస్త్రాలతో సన్మానించగా.. వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సీఎం జగన్ను వివరించారు. ఆ తర్వాత దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, కమిషనర్ హరిజవహర్లాల్ను కలిసి ఆహ్వానాలు అందజేశారు.