శ్రీబాలాజీ జిల్లా : అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ క్రతువుల్లో అక్కడ స్థిరపడిన తెలుగువారు విశేష సంఖ్యలో హాజరై శ్రీనివాసుడి కల్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కల్యాణోత్సవం జరిగింది.
కల్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కల్యాణోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతోపాటు విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ ఆర్ ఐ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ అమర్నాథ రెడ్డి, తెలుగుబాషా సంఘం చైర్మన్ లక్ష్మీ ప్రసాద్, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, ప్రతాప్ భీంరెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ మేడపాటి వెంకట్, రాజు వేఘ్నేశ, నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, నాటా ప్రతినిధులు రఘువీర్ బండారు, రమేష్ వల్లూరు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.