తిరుపతి: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ నగరాల్లో గత కొన్నాళ్లుగా శ్రీవారి కల్యాణాలను జరుపుతున్నారు. భారతకాల మానం ప్రకారం మంగళవారం వేకువ జామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. టీటీడీ అర్చకస్వాములు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం, సాంప్రదాయ బద్దంగా కల్యాణాన్ని నిర్వహించారు.
శ్రీవారి కల్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ స్వామి ప్రసాదం పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఎపీఎన్ ఆర్టిసీ, టీటీడీతోపాటు ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలను సమన్వయం చేసుకుని కల్యాణోత్సవం నిర్వహణలో పాలు పంచుకుంటున్నది.