తిరుపతి : వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతర వైదిక అంశాలకు సంబంధించి సందేహాలపై ఆధార సహితంగా నివృత్తి చేయగలిగే స్థాయికి వేద విశ్వవిద్యాలయం చేరుకోవాలని టీటీడీ ఈవో(TTD EO) ఎవిధర్మారెడ్డి పిలుపునిచ్చారు. వేద విద్య, వేద విజ్ఞానం ఆధునిక సమాజానికి అత్యవసరమైన నేటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయం ప్రపంచ చిత్రపటంపై ప్రత్యేక స్థానం సాధించుకోవాలని సూచించారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం(Vedic University) 18వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది.
ఈవో మాట్లాడుతూ వేద విద్యను విశ్వవ్యాప్తం చేసి సమాజం ధర్మబద్ధంగా నడవాలనే ఉద్దేశంతో టీటీడీ వేద విశ్వవిద్యాలయం ప్రారంభించిందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపి మంచి వైపు నడిపించే గురుతర బాధ్యతను వేద విద్యార్థులు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు వేద విజ్ఞానాన్ని నూతన మార్గంలో ప్రపంచానికి అందించేలా కృషి చేయాలన్నారు. తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి అందించేందుకు కృషి చేయాలని కర్తవ్య బోధ చేశారు. జన్మ, మృత్యు రహస్యాలు, మానవ శరీరాన్ని నడిపించే శక్తికి సంబంధించిన విజ్ఞానం పై ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
ఇందుకు సంబంధించి నిర్దిష్ట పరిశోధనలు చేసి ప్రపంచం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైపు చూసేలా పని చేయాలన్నారు. యోగ, క్రియ, ధ్యానం నేటి సమాజానికి ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ప్రపంచం సంపాదించడం, కూడబెట్టుకోవడం అనే అంశాలపైనే ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో మానవులకు ఆరోగ్యం, శాంతి, ఉపశమనం కల్పించే కేంద్రంగా విశ్వవిద్యాలయం తయారు కావాలన్నారు. జేఈవో సదా భార్గవి, ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యాం పాల్గొన్నారు.
యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణ
వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసిన భారతీయ విజ్ఞాన ధార యూట్యూబ్ ఛానల్ను ఈవో ఆవిష్కరించారు. అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించిన సురభి న్యూస్ లెటర్, వర్సిటీ పరిశోధన, ప్రచురణల విభాగం రూపొందించిన హరివంశం రెండవ భాగం, బ్రహ్మసూత్ర భాష్యం మొదటి, రెండవ భాగం పుస్తకాలను ఆవిష్కరించారు.