Ruya Hospital | తిరుపతిలోని రుయా దవాఖాన వద్ద జరిగిన ఘటనకు కారణమైన వారుగా భావిస్తున్న ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దవాఖాన అంబులెన్స్ల డ్రైవర్లు సంఘంగా ఏర్పాటై అక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసులు నిర్వహించిన ప్రాధమిక దర్యాప్తులో తేలిందని స్థానిక డీఎప్సీ మురళీకృష్ణ చెప్పారు. తిరుపతిలోని రుయా దవాఖాన వద్ద అంబులెన్స్ మాఫియా ప్రభావం వాస్తవమేనని అధికారులు నిరాకరించారు. ఘటన తర్వాత ఆర్డీవో, డీఎస్పీతో సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ విచారణలో అంబులెన్స్ మాఫియా నిజమని తేలింది.
ఈ కమిటీ నివేదిక ఆధారంగా దవాఖాన సీఎస్ఆర్ఎంవో సరస్వతీదేవిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దవాఖాన సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. రుయా దవాఖాన ఘటనపై సీఎం వైఎస్ జగన్తో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజనీ సమావేశమయ్యారు. ఇప్పటివరకు జరిగిన, తీసుకున్న చర్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు.
మంగళవారం పదేండ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి రుయా దవాఖాన అంబులెన్స్ సిబ్బంది అనుసరించిన, వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశమైంది. అన్నమయ్య జిల్లా చిట్వేలి వాసి మామిడి తోట కూలి.. తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల రుయా దవాఖానలో చేర్చారు. ఆ బాలుడి కిడ్నీ, కాలేయం పూర్తిగా పని చేయకపోవడంతో సోమవారం రాత్రి 11 గంటల వేళ మరణించాడు.
ఆ బాలుడి మృతదేహాన్ని తిరుపతి నుంచి 90 కి.మీ దూరంలోని చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్ డ్రైవర్లు రూ.10వేలు ఖర్చవుతుందని చెప్పారు. ఆ మొత్తం భరించలేక తండ్రి ఈ సంగతి తన ఊళ్లోని బంధు, మిత్రులకు చెబితే సొంతంగా అంబులెన్స్ పంపారు. కానీ ఆ అంబులెన్స్ డ్రైవర్ను రుయా దవాఖాన అంబులెన్స్ల డ్రైవర్లు కొట్టి తిప్పి పంపారు. తమ అంబులెన్స్లోనే తీసుకెళ్లాలని పట్టుబట్టారు. చేసేదేమీలేక బాలుడి తండ్రి.. టూ వీలర్పైనే సొంతూరికి తీసుకు వెళ్లారు.