అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో భారీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటయ్యేందుకు రంగం సిద్ధమైంది. పలనాడు జిల్లా పరిధిలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో శ్రీ సిమెంట్ కంపెనీ తన తదుపరి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. పెదగార్లపాడులో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ను రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ సిమెంట్ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ యూనిట్ కలిగి ఉండనున్నది.
దేశంలో ప్రస్తుతం ఉన్న శ్రీ సిమెంట్ కంపెనీ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.4 మిలియన్ టన్నులు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సామర్థ్యంలో 64 శాతం వినియోగంగా ఉన్నది. వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ 2024 డిసెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు శ్రీ సిమెంట్ లిమిటెడ్ వెల్లడించింది. రూ.2,500 కోట్ల పెట్టుబడిని సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
కాగా, ఏపీలో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు గత ఏడాది డిసెంబర్ 20న శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పెదగార్లపాడులో భారీ పెట్టుబడితో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీ సిమెంట్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.