తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల(Tirumala)లో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల( Security arrangements)కోసం ఆధునిక టెక్నాలజీని( Modern technology) ఉపయోగించుకోనున్నట్లు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీసీటీవీ కంట్రోల్ రూమ్ లో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్వేర్లను వాడాలి అనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ(Anti-drone technology), బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఏస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.
ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి భద్రత అంశాలను తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో తిరుమలలో సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని వారు పరిశీలించారు.