Sajjala | సినీ నటుడు చిరంజీవిని ఎవరూ అవమానించలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సపష్టం చేశారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు. ఆయన గొప్ప నటుడని.. కానీ, బ్యాంకులను మోసం చేసిన వ్యక్తులను పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చెడు ఆలోచనలు చేసే వారి గురించి ఆయనన మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పవన్ కల్యాణ్కు రెండు సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలని జనసైనికులు కోరుకుంటున్నారన్న సజ్జల.. చంద్రబాబు పవన్ను 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారన్నారు.
ఆ 21 మందిలో సైతం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు 12 మంది ఉన్నారని.. ఆ లెక్కన పవన్ తన సొంత మనుషులకు టికెట్లు పది మందికే ఇప్పించుకోగలిగారన్నారు. ఇందులోనూ ఇంకా కోత పడే అవకాశాలు లేకపోలేదని.. చివరకు పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడవచ్చన్నారు. ప్రచారం వంకతో పవన్ పిఠాపురానికి వీడ్కోలు చెప్పే అవకాశాలున్నాయన్నారు. అన్ని సీట్లపై తన పట్టుండాలని చంద్రబాబు భావిస్తారని.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ను తప్పించి టీడీపీ నేత వర్మను బరిలోకి దింపే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు.