అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధితో చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో అంబులెన్స్ నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుయాలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఒకట్రెండు ఘటనలతో మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నెంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని, 108, 104 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వంటి వాహనాలపై కూడా నంబర్లు పెద్దగా రాయాలని సూచించారు. విజయవాడలో యువతిపై లైంగిక దాడి లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. కొవిడ్ నివారణ చర్యలను సమర్ధవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.