అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని జోస్యం చెప్పారు. విద్యావ్యవస్థను సమూల మార్పు పేరిట పాఠశాలల విలీనంతో రాష్ట్రంలో అనేక పాఠశాలలు మూతపడుతున్నాయని తెలిపారు.
విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని అన్ని గ్రామాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఏపీలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినట్లుగానే విద్యావ్యవస్థను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని జగన్పై విరుచుకు పడ్డారు.