అమరావతి : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ నోవల్ టాటా (Ratan Tata) మరణం భారతదేశానికి తీరని లోటు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారని ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా నేతృత్వంలో ఉప్పు నుంచి మొదలుకొని, విమానయాన (Aviation)రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని అన్నారు. ఆయన హయాంలో టాటాను భారతదేశపు ఉనికి గా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారని, కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని వెల్లడించారు.
ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అన్నారు.