తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నో ఆశలతో శ్రీకాళహస్తికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాహుకేతు పూజలు నిలిపివేసిన సమాచారాన్ని భక్తులకు అందజేయడంలో విఫలం కావడంతో.. సమాచారం తెలియక భక్తులు శ్రీకాళహస్తికి వచ్చి రాహుకేతు పూజలు చేయకుండానే వెనుదిరుగుతున్నారు. అధికారుల తీరుపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారని తెలిసి కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీకాళహస్తి ఆలయంలో నాగపడగల కొరత నెలకొన్నది. దాంతో దోష నివారణ కోసం చేసే రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. పూజలకు నాగపడగలను అధికారులు సిద్ధం చేయలేదు. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లలోనే నిల్చుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నాగపడగలను సిద్ధం చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని భక్తులు ఆరోపిస్తున్నారు.
రాహు కేతు పూజలకు శ్రీకాళహస్తి ప్రత్యేకమైనది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు చాలా మంది శ్రీకాళహస్తి వచ్చి దోష నివారణ కోసం రాహుకేతు పూజలు చేయించుకుంటారు. తిరుమలలో గత కొన్ని వారాలుగా ఎక్కువ రద్దీ ఉన్నది. మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయి ఉంటున్నాయి. తిరుమల నుంచి శ్రీకాళహస్తికి భక్తులు వస్తారని తెలిసినప్పటికీ అధికారులు నాగపడగలను సిద్ధం చేయడంలో విఫలమయ్యారు. దాంతో పెద్ద సంఖ్యలో శ్రీకాళహస్తికి వస్తున్న భక్తులు నాగపడగలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.