అమరావతి : అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లల్లో అధికారులు భద్రతను పెంచారు. విజయవాడలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్కు అదనంగా 3వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. టికెట్లు ఉన్నవారికే విజయవాడ స్టేషన్లోకి అనుమతి ఇస్తున్నారు. స్టేషన్కు నలుమూలల ఉన్న గేట్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు.
ప్రయాణికులను తనిఖీలు చేసిన తరువాతనే రైల్వేస్టేషన్లోకి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాణా టాటా మాట్లాడుతూ యువకులు, విద్యార్థులు ఆందోళనకు దిగొద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతపై కేసు నమోదైతే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. కాగా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు.