విజయనగరం: ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అప్పీలేట్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు నియమితులయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వర్తించిన రాజు.. ప్రస్తుతం సెంచూరియన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా కొనసాగుతున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన వివిధ సమస్యలను అప్పీలేట్ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే, విద్యార్థులు, యాజమాన్యం లేవనెత్తే పలు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.
ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ఏఐసీటీఈతో కలిసి పనిచేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఈ సందర్భంగా ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు అభిప్రాయపడ్డారు. అప్పీలేట్ కమిటీ దేశవ్యాప్తంగా కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వెల్లడించారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల మధ్య వారధిగా ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు అప్పీలేట్ కమిటీ ముందుండేలా కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు.