Posani Krishnamurali | జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి, కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించగా.. తాజాగా పోసాని కృష్ణమురళి కూడా జనసేనానిపై విరుచుకుపడ్డారు. పవన్కళ్యాణ్ వెంటనే ముద్రగడకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ కంటే కూడా ముద్రగడ గొప్ప లీడర్ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయన ఏ రోజు రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందలేదని తెలిపారు. ముద్రగడకు వెంటనే పవన్ కళ్యాణ్ క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ వల్లే కాపుల్లో చిచ్చు మొదలైందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నావ్ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేడో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సినిమా ఆర్టిస్ట్ అని మాత్రమే పవన్ను చూసేందుకు జనాలు వస్తున్నారని విమర్శించారు. అయినా పవన్ కళ్యాణ్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడ్డమేంటని ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేయడమేంటని నిలదీశారు. లోకేశ్, చంద్రబాబు కంటే పవన్కళ్యాణ్ చాలా మంచివాడు.. ఇప్పిడిలా ఎందుకు అయిపోయాడో తెలియడం లేదని అన్నారు. మీ కాపుల్పి తిట్టుకుని నువ్వే దూరం చేసుకుంటున్నావని పవన్కు పోసాని సూచించారు. చంద్రబాబు ఏ రోజు తన వర్గం నేతలను తిట్టలేదని గుర్తుచేశారు.
అభిమానుల చేత బండబూతులు తిట్టించడం మగతనం కాదని.. సినిమాల్లో తప్ప రాజకీయాల్లో హీరో కాదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని పవన్పై విరుచుకుపడ్డారు. మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కాకినాడలో పోటీచేయడం చేతకాకపోతే.. పిఠాపురంలో తనపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. ఈ మేరకు పలు ప్రశ్నలతో పవన్ కళ్యాణ్పై లేఖాస్త్రాన్ని సంధించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పొలిటిషీయనే కాదు.. పెయిడ్ ఆర్టిస్ట్ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పవన్ చదివేది చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టేనని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజాసమస్యలు ఏ మాత్రం పట్టవని అన్నారు.