Nellore | ఏపీలోని నెల్లూరులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి చెక్ పెట్టేందుకు వైసీపీ పోరు ప్రారంభించింది. వైసీపీ నేతలు కోటంరెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేస్తుంటే.. తనపై వస్తున్న ఆరోపణలు అన్నింటినీ కోటంరెడ్డి తిప్పికొడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా గురువారం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పునరద్ఘాటించారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్రెడ్డిపై ఆయన మండిపడ్డారు. నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని అంతా చెబుతున్నారని ఆయన అన్నారు. అసలు ఆదాల ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బీఫామ్ తీసుకుని.. జగన్ను కలిసిన ఘనత ఆదాలది అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తా నా గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు. పులివెందుల రౌడీ జగన్.. నెల్లూరు రౌడీ కోటంరెడ్డి అని గతంలో ఆదాల చేసిన విమర్శలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి వైసీపీలో కొనసాగుతారని తనకు నమ్మకం లేదని అన్నారు. గతంలో మాదిరి అన్ని పార్టీలు తిరగొద్దని ఆదాలకు హితవు పలికారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆదాలతో పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. ఆదాలకు వేల కోట్లు ఉంటే.. తనకు అంతకంటే విలువైన నియోజకవర్గ ప్రజల అభిమానం ఉందని చెప్పారు. తాను ఎవరినీ శత్రువుగా భావించడం లేదని.. రాజకీయ పోటీదారుడుగానే చూస్తానని స్పష్టం చేశారు.
ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా కోటంరెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. అది కాల్ రికార్డింగ్ మాత్రమేనని అతని స్నేహితుడు రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్టునే రామశివారెడ్డి చదివారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కూడా దీనిపై విచారణ కోరాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరిపితేనే రాష్ట్రంలో ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ జరిగాయో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రెస్మీట్లు పెట్టి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పు అని కోటంరెడ్డికి సూచించారు. మూడున్నరేళ్ళుగా ఎంతో అరాచకం చేశావు.. డబ్బు పిచ్చి ఎక్కువైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి గుట్టును ప్రజలు త్వరలోనే విప్పుతారని అన్నారు. ఇక కోటంరెడ్డి సవాలు స్వీకరించి ఆదాల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీచేస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో కోటంరెడ్డికి వచ్చిన ఓట్ల కంటే కూడా.. నెల్లూరు రూరల్లో తనకు 5వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు.
టీడీపీలోకి వెళ్లేందుకే రాష్ట్ర ప్రభుత్వంపై కోటంరెడ్డి విమర్శలు చేస్తున్నారని ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. అది ఫోన్ ట్రాప్ కాదని.. చంద్రబాబు మాన్ ట్రాప్ అని ఎద్దేవా చేశారు. కోటంరెడ్డితో ఫోన్లో మాట్లాడిన వ్యక్తే మీడియాకు వాస్తవాలు వెల్లడించారని చెప్పారు. ట్యాపింగ్ ఆరోపణ నిజమైతే కోటంరెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. వాపును చూసి కోటంరెడ్డి బలుపు అని భ్రమ పడుతున్నారని విమర్శించారు.