అమరావతి : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ (Pawan Kalyan) వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) కు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమున్నట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. వైసీపీ ఆకు రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ ( Yoginath ) వంటి ట్రీట్ మెంట్ ఇస్తేనే తిక్క కుదురుతుందని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో డిప్యూటీ సీఎం శనివారం పర్యటించారు. అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రభుత్వం తలచుకుంటే బలమైన వామపక్ష తీవ్రవాదమే కకావిలకమైంది. రెండ్రోజులు కిరాయి గూండాలు, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుంది.
రౌడీలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఇలాంటి మాటలు రావని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన తరువాత రెండు నెలల్లో జైలుకే పంపిస్తామని వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపధ్యంలో పవన్ కల్యాణ్ జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారని విమర్శించారు. ఎవరి బెదిరింపులకు కూటమి ప్రభుత్వం భయపడలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తక్కువ సీట్లు పొందారని ఎంతో మందితో తిట్లు తిన్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీతో జత కట్టి ప్రస్తుతం వేలాది కోట్ల రూపాయాలతో కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.