Janasena | ఏపీ రాజకీయాల్లో జనసేన పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన ఇప్పటికే చాలా నష్టపోయింది. కేవలం 24 సీట్లకే పరిమితమయ్యింది. ఇక బీజేపీ కూడా కూటమిలో చేరడంతో మరో మూడు సీట్లను పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చింది. చివరకు తన అన్న నాగబాబుకు కేటాయించిన సీటును కూడా పొత్తు ధర్మం కోసం వదులుకోక తప్పలేదు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించి ఇప్పటికే చాలా నష్టపోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరో త్యాగం చేయకతప్పదని ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 12 టీడీపీ తీసుకుంది. మిగిలిన విజయవాడ వెస్ట్, అవనిగడ్డ స్థానాలను జనసేనకు కేటాయించింది. దీంతో విజయవాడ వెస్ట్ టికెట్పై జనసేన చాలానే ఆశలు పెట్టుకుంది. పోతిన మహేశ్ను అభ్యర్థిగా నిలబెట్టాలని జనసేన భావిస్తోంది. టికెట్ తమకే కన్ఫార్మ్ అని తెలియడంతో మహేశ్తో పాటు జనసేన కార్యకర్తలు కూడా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడే జనసేనకు బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. పొత్తుల సర్దుబాటులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ను తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతుంది. ఒకవేళ బీజేపీ వెనక్కి తగ్గకపోతే వెస్ట్ టికెట్ను వాళ్లకే కేటాయించాల్సి వస్తుంది. అంటే పొత్తుల కోసం ఇప్పటికే మూడు సీట్లను త్యాగం చేసిన జనసేన.. మరో సీటును త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి సీటును కేటాయిస్తే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ముగ్గురు నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, వైసీపీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు బీజేపీలో చేరి వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే వన్టౌన్ బ్రాహ్మణ వీధికి చెందిన ఎన్నారై గొలగాని రవికృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. విజయవాడ పాతబస్తీ వాస్తవ్యుడైన శివస్వామిని కూడా పోటీలో దించేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి విజయవాడ వెస్ట్ బీజేపీకి దక్కితే వీరిలో ఎవరికి సీటు కేటాయిస్తుందో చూడాలి.!