విజయవాడ: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు అనవసర, పసలేని ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసేందుకు అవకాశాలు లేకపోవడంతో ఏదో ఒక వంక పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతున్నారన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనను కొందరు స్వాగతించగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు కూడా ఆందోళనకారులకు మద్దతు తెలుపుతున్నారు. ప్రతిపక్షాల తీరుపు మంత్రి బాలినేని స్పందిస్తూ.. కొత్త జిల్లాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాయచోటిని జిల్లా కేంద్రంగా, హిందూపురం పరిధిలో పుట్టపర్తిని కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాగా ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. విదేశాల్లో కూడా సత్యసాయికి భక్తులు ఉన్నారని అందుకే భక్తులకు అనుకూలంగా ఉండేలా సత్యసాయి జిల్లాను ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. విజయవాడ జిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ప్రతిపాదించినట్లు బాలినేని స్పష్టం చేశారు. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఒక జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టకపోవడంపై మండిపడ్డారు. ఒంగోలుకు చెందిన గుప్తా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఫ్లెక్సీలు ప్రదర్శించినట్లు తెలిసిందని, అతడి వెనక ఎవరున్నారో అందరికీ తెలుసునని అభిప్రాయపడ్డారు.