తిరుపతి : వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి (Ontimitta Kodandaramaswamy) ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమంలో అర్చకులు పలు పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
ఈ నెల 25వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల (Brahmotsavam) కు ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు. ఉదయం, సాయంత్రం స్వామివారు వివిధ వాహనాల్లో పురవీధుల్లో ఊరేగుతారని ఆలయ అధికారులు వివరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కేవలం 4 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 67,294 మంది భక్తులు దర్శించుకోగా, 22,765 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 2.94 కోట్లు వచ్చిందని వెల్లడించారు.