తిరుమల : తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ (Octopus) దళం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్(Mock drill) ద్వారా ప్రదర్శించారు.
ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ నాగేంద్రబాబు పర్యవేక్షణలో అదనపు ఎస్పీ నగేష్బాబు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. ఈ ఆపరేషన్ లో తిరుమల విజివో నంద కిషోర్, తిరుమల డి.ఎస్.పి శ్రీనివాస ఆచారి, ఏవిఎస్ఓలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.