హైదరాబాద్, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ): పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరంతో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపట్టడంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వానికి రూ.248 కోట్ల భారీ జరిమానాను విధించింది. అదీగాక ప్రాజెక్టు పనులను సత్వరమే నిలిపివేయాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ వేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ గురువారం తీర్పును వెలువరించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే పోలవరం, చింతలపూడి, పురుషోత్తమపట్నం, పట్టిసీమ తదితర సాగు ప్రాజెక్టు పనులను ఏపీ సర్కారు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో మొత్తంగా రూ.248 కోట్ల జరిమానాను విధించింది. పోలవరం ప్రాజెక్టుపై రూ.120 కోట్లు, పురుషోత్తమపట్నంపై రూ.24.56 కోట్లు, పట్టిసీమపై రూ.24.90 కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్ల జరిమానాను హరిత ట్రిబ్యునల్ విధించింది. ఆ మొత్తాన్ని 3 నెలల్లోగా ఏపీ పీసీబీకి చెల్లించాలని ఏపీ సర్కారును ఆదేశించింది. చింతలపూడి ప్రాజెక్టు పనులను కొనసాగించుకోవచ్చని, అయితే మూడు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, లేదంటే పనులు నిలిపేయాల్సిందేనని స్పష్టం చేసింది. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం పనులను కూడా తక్షణమే నిలిపేయాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులను జారీచేసింది.