Adala Prabhakar Reddy | వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలుపుకోవాలనే పట్టుదలతో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. అన్ని జిల్లాల ఇన్ఛార్జిలను మార్చేస్తున్నారు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం లేదు. దీంతో అసహనంలో ఉన్న పలువురు వైసీపీ నేతలు పార్టీ మారేందుకు సుముఖత చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త వైరల్ కావడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తనను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలవడంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు స్పష్టంచేశారు. వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.